Kavitha: ఆదివారం ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా విచారించింది సీబీఐ. మరోసారి విచారిస్తామంటూ నోటీసులు కూడా ఇచ్చింది. కట్ చేస్తే, సోమవారం తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ పెట్టడం వెనుక ఉద్దేశం కేంద్రాన్ని, బీజేపీని బెదిరించే ప్రయత్నమా? సీబీఐ దాడులకు భయపడబోమని.. పోరాడతామని.. ఆత్మనిర్భరం ప్రదర్శించడానికా? బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేస్తాం.. తెలంగాణ తరహాలో ఉద్యమిస్తాం.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో జాగృతిని విస్తరిస్తాం.. అంటూ కవిత తన అనుచరులను యుద్ధానికి సిద్ధం చేశారు.
కవిత వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఇకపై తెలంగాణ జాగృతిని.. దేశవ్యాప్తం చేస్తారని తెలుస్తోంది. పేరు కూడా మార్చే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినట్టే.. భారత జాగృతి అనే పేరు పెట్టొచ్చని అంటున్నారు. అంటే, అచ్చం తెలంగాణ ఉద్యమం మాదిరే తండ్రికి తోడుగా తన సంస్థను రెడీ చేస్తున్నారని అంటున్నారు.
సేమ్ టు సేమ్.. సక్సెస్ ఫుల్ తెలంగాణ ఉద్యమ ఫార్ములానే బీఆర్ఎస్ విషయంలోనూ కేసీఆర్ అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలు. బీఆర్ఎస్ విషయంలో కాస్త మార్పు చేసి.. నీళ్లు, నిధులు, రైతులు స్లోగన్ అందుకోబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నదీజలాల లెక్కలు వల్లెవేస్తున్నారు గులాబీ బాస్. చైనాతో పోల్చుతూ వెనుకబాటుతనాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. అగ్ లీ బార్ కిసాన్ సర్కార్ అంటూ రైతు సంక్షేమమే తమ ఎజెండా అని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ఇదంతా దాదాపు తెలంగాణ తరహా స్ట్రాటజీనే అంటున్నారు.
ఇక, తెలంగాణ ఉద్యమ సమయంలో కూతురు కవితతో జాగృతి సంస్థను ఏర్పాటు చేయించారు కేసీఆర్. బతుకమ్మ మెయిన్ థీమ్ గా, మహిళలు, కవులు, కళాకారులను ఏకం చేశారు. వారి గళమే.. ధూంధాం ఆటపాటలే ఉద్యమాన్ని ఉరకలెత్తించాయి. అది బాగా వర్కవుట్ కావడంతో.. బీఆర్ఎస్ కు ఉపయోగపడేలా.. తెలంగాణ జాగృతి తరహాలో, భారత జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా వివిధ రకాల సంస్కృతి, సంప్రదాయాలను ఏకం చేయాలనేది కేసీఆర్ ఆలోచనలా కనిపిస్తోంది. ఆ మేరకు త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో జాగృతిని విస్తరిస్తామని.. ఇక విశ్రాంతి లేదంటూ సభ్యులకు పిలుపు ఇచ్చారు కవిత. మరి, తెలంగాణలో వర్కవుట్ అయినట్టు.. సేమ్ స్ట్రాటజీ దేశవ్యాప్తంగా పని చేస్తుందా? మన లోకల్ లీడర్ల ఛరిస్మా.. నేషనల్ వైడ్ గా ప్రభావం చూపిస్తుందా? బీఆర్ఎస్ ఉన్నతికి భారత జాగృతి బాటలు వేస్తుందా?