Kavitha Liquor Scam Update : సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. గతంలో 161 సీఆర్పీసీ కింద ఈ కుంభకోణంలో కవితను సాక్షిగా మాత్రమే విచారించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 41 ఏ సీఆర్పీసీ కింద నిందితురాలిగా చేర్చుతూ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీబీఐ నోటీసులతో కవిత, బీఆర్ఎస్ శ్రేణులు డైలమాలో పడ్డారు.
Read More : తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు.. డీజీగా ఐజీ స్టీఫెన్
లిక్కర్ కేసులో ఉన్న కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు.. కవిత ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. అదే విధంగా పీఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పారని సమాచారం అందుతోంది. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు ఒప్పుకోవడంతోనే.. అశోక్, కవితను నిందితులుగా చేర్చి.. సీబీఐ అధికారులు విచారించేందుకు సిద్దమయ్యారని భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో అశోక్ ఇచ్చిన సమాచారం తోనే కవితను ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే కవిత విచారణకు హాజరవుతారా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కవిత రెండు రోజుల నుంచి న్యాయ సలహాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. సీబీఐ విచారణకు హాజరు కాకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈడీ కేసులో సోమవారం నాడు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. సీబీఐ కేసులోనూ కవిత సోమవారం వరకు సమయం కోరే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.