Kavitha: అంత పెద్ద కేసు. తెలంగాణను షేక్ చేస్తున్న దర్యాప్తు. ఈడీ రిమాండ్ రిపోర్టులో నేరుగా ఆమె పేరు ఉంది. ఇంత పెద్ద ఎపిసోడ్ పై కవిత ఇచ్చిన రియాక్షన్ అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లక తప్పదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారు. కవిత సైతం అదే అన్నారు. మా అంటే ఏం చేస్తారు? జైల్లో పెట్టుకోండి.. ఏం ఉరి వేస్తారా? అంతకంటే ఇంకేం చేస్తారు? భయపడేదేలేదంటూ సవాల్ చేశారు కవిత.
కవిత తన షార్ట్ స్పీచ్ లో ఎక్కడా తనకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదని గానీ, తనకు లిక్కర్ వ్యాపారం లేదని గానీ, అమిత్ అరోరా ఎవరో తనకు తెలీదని గానీ ఒక్కసారి కూడా అనలేదు. అదే, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇదే కేసులో స్పందిస్తూ.. తనకేం సంబంధం లేదని, తాను లిక్కర్ బిజినెస్ చేయడం లేదని.. సౌత్ స్టేట్స్ పై కుట్ర జరుగుతోందని.. ఈడీ రిపోర్టును పూర్తిగా ఖండించారు. కవిత మాత్రం అలా అనకపోవడం ఆసక్తికరం.
జైల్లో పెట్టుకోండి.. ఉరి వేసుకోండి.. ప్రశ్నలడిగితే జవాబిస్తేం.. వచ్చే ఏడాది ఎన్నికలు కాబట్టే మోదీ కంటే ముందు ఈడీ వచ్చింది.. ఇది రాజకీయ ఎత్తుగడ.. తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు.. ఇలా ఏదేదో చెప్పింది కానీ.. అసలు ఆ కేసుతో తనకేం సంబంధం లేదని మాత్రం చెప్పకపోవడం అనుమానాస్పదం.
ఇక, కవిత మంచి వాగ్దాటి ఉన్న నేత. గలగలా మాట్లాడగలిగే సామర్థ్యం, ఎదుటి వారిపై మాటలతో అటాక్ చేయగల నైపుణ్యం ఎక్కువ. అలాంటి కవిత.. చాలా సింపుల్ గా పట్టుమని 10 వ్యాఖ్యాల్లోనే తన వివరణ ముగించేశారు. ఆ మాత్రానికి మీడియా ముందుకు రావడం ఎందుకు? ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే సరిపోతుందిగా? అంటున్నారు. ఇక, మాట్లాడే సమయంలో ఆమె స్వరంలో మునుపటి గాంభీర్యం లేదు. మాటలు తడబడ్డాయి. గొంతు పీలగా ఉందని అంటున్నారు. లోలోన ఏదో భయం ఆమెను వెంటాడుతున్నా.. బయటకు మాత్రం ధైర్యం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు, కవిత వెంట ఎమ్మెల్సీ ఎల్.రమణ మినహా టీఆర్ఎస్ పెద్ద లీడర్లెవరూ లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది. సాధారణంగా గులాబీ నేతలు మీడియా ముందుకు వస్తే.. వారి వెంట మినిమమ్ డజన్ మంది బడా నాయకులు తోడుగా హాజరవుతారు. అలా బలప్రదర్శన చూపిస్తారని అంటారు. అలాంటిది ఇంతటి బిగ్ ఇష్యూలో కవిత ప్రెస్ మీట్ పెడితే.. రమణ మినహా ఓ స్థాయి ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేకపోవడమేంటని ఆరా తీస్తున్నారు. అంటే, పార్టీలో కవిత ఒంటరి అయ్యారా? కల్వకుంట్ల కుటుంబ వైరం ఇంకా కొనసాగుతూనే ఉందా?