Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. బయటకు వచ్చిన కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ.. స్మైల్ ఇస్తూ కనిపించారు. రోజంతా ఫుల్ టెన్షన్ నెలకొనగా.. ఎట్టకేళకు అప్డేట్ వచ్చింది.
అయితే అంతలోనే మరో బ్రేకింగ్ న్యూస్. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలంటూ ఈడీ తెలిపింది. దీంతో.. కవిత అరెస్ట్పై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. మంగళవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. సుదీర్ఘంగా 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించింది ఈడీ. బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని, కవితను ఎదురెదురుగా ఉంచి సమగ్రంగా విచారించారు. మనీశ్ సిసోడియాతోనూ కలిపి విచారించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు. మద్యం కేసులో మనీలాండరింగ్పై విచారణ జరిపారు.
ఈడీ కార్యాలయం దగ్గర సాయంత్రం తర్వాత హైటెన్షన్ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. వైద్యుల బృందం వెళ్లి కవితకు వైద్య పరీక్షలు చేసింది. కవిత తరఫు లీగల్ టీమ్ సైతం కార్యాలయంలోకి వెళ్లి ఈడీ అధికారులను కలిసింది. వారిలో తెలంగాణ అడిషనల్ ఏజీ కూడా ఉన్నారు. విచారణపై కవిత లాయర్ల టీమ్కు ఈడీ బ్రీఫింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడిందని బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని.. పనికిమాలిన పార్టీలు దుష్ప్రచారం చేస్తాయని.. వాటిని తిప్పికొట్టాలని కేడర్కు పిలుపు ఇచ్చారు. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని.. భయపడేది లేదన్నారు గులాబీ బాస్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటినుంచీ సంచలనమే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది ఈడీ. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. సౌత్ గ్రూప్లో కవితనే కీ పర్సన్ అని ఈడీ భావిస్తోంది. ఆప్ నేతలకు 100 కోట్లు ముడుపులు అందించారనేది ఈడీ ఆరోపణ.
ఇండోస్పిరిట్ కంపెనీలో వాటాదారుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై.. కవిత బినామీనే అంటూ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది ఈడీ. కవిత తన పది ఐ-ఫోన్లను ధ్వంసం చేయడం.. మనీష్ సిసోడియాతో మాట్లాడటం.. అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్లను కలవడం.. అడిటర్ బుచ్చిబాబు ప్రతినిధిగా వ్యవహరించడం.. ఇలా అనేక కోణాల్లో కవితను ప్రశ్నించింది ఈడీ.
ఇప్పటికే రెండు దఫాలుగా కవితను సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఆమెను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ జరగలేదు. అయితే, మంగళవారం మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ తెలపడంతో.. కవిత అరెస్ట్పై హైటెన్షన్ అలానే ఉంది.