Kavitha : సీబీఐకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 6న విచారణకు అందుబాటులో ఉండలేనని లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని కవిత స్పష్టం చేశారు. సీబీఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించానని తెలిపారు. అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 6న విచారణ చేస్తామని ఇటీవల సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోగానీ, హైదరాబాద్ లోగానీ కవిత నివాసంలోనే విచారిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై స్పందించిన కవిత హైదరాబాద్ లో విచారణకు రావాలని సీబీఐకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత రోజే కవిత ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉందని మెయిల్ ద్వారా సమాధానమిచ్చారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు ఇప్పుడు మరో లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న తాను సీబీఐ అధికారులకు అందుబాటులో ఉండలేనని సమాచారం ఇచ్చారు.
ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకు కవిత తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.