Delhi: ముచ్చటగా మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. వరుసగా రెండోరోజు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సోమవారం సుదీర్ఘంగా పదిన్నర గంటల పాటు కవిత ఎంక్వైరీ జరిగింది. మంగళవారం మళ్లీ రమ్మన్నారు ఈడీ అధికారులు. ఉదయం పదకొండున్నరకు ఈడీ ఆఫీసుకు వెళ్తూ.. తాను వాడిన 10 పాత ఫోన్లను తీసుకెళ్లారు కవిత. ఆ ఫోన్లను రెండు ప్లాస్టిక్ కవర్లలో ఉంచి.. మీడియాకు చూపించారు. ఈసారి కూడా కవిత వెంట భర్త అనిల్ ఈడీ ఆఫీసు వరకు వచ్చారు.
మరోవైపు, ఫోన్ల విషయంలో ఈడీ అధికారి జోగేంద్రకు లేఖ రాశారు కవిత. ఈడీ రాజకీయ కోణంలోనే విచారణ చేస్తోందని.. దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేశానని గత నవంబర్ నుంచే ప్రచారం చేస్తున్నారని.. తనను విచారణకు పిలిచిందే ఈ ఏడాది మార్చిలో అని.. అలాంటప్పుడు ఫోన్ల విషయంలో ఆ దుష్ప్రచారం ఎందుకు చేశారని ప్రశ్నించారు. పాత ఫోన్లు ఇవ్వమంటూ కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని.. అయినా అడిగారు కాబట్టి తన 10 పాత ఫోన్లను తీసుకొచ్చానని అన్నారు. మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కాదా? అంటూ ఈడీని నిలదీశారు కవిత.
మంగళవారం నాటి ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం.. బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని, కవితను ఎదురెదురుగా ఉంచి సమగ్రంగా విచారించారు. మనీశ్ సిసోడియాతోనూ కలిపి విచారించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు. మద్యం కేసులో మనీలాండరింగ్పై విచారణ జరిపారు. సోమవారం సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చిన కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ.. స్మైల్ ఇస్తూ కనిపించారు.
ఇప్పటికే రెండు దఫాలుగా కవితను సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఆమెను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం మరోసారి విచారణకు హాజరుకావడంతో.. కవిత అరెస్ట్పై హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటినుంచీ సంచలనమే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది ఈడీ. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. సౌత్ గ్రూప్లో కవితనే కీ పర్సన్ అని ఈడీ భావిస్తోంది. ఆప్ నేతలకు 100 కోట్లు ముడుపులు అందించారనేది ఈడీ ఆరోపణ.