Muscle Atrophy : ఆయనని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఒకటికాదు రెండుకాదు నలభై ఏళ్ళుగా మంచానికే పరిమితం అయ్యాడు. అరుధైన వ్యాధైన కండరాల క్షీణిత రోగంతో పోరాటం చేస్తున్నాడు. గతంలోనే మెర్సికిల్లింగ్ కు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకి లేఖ రాసి సంచలనం సృష్టించాడు. కానీ ఇప్పుడు ఈ వ్యాధిపైనా పరిశోధన చేయటానికి తన శరీరాన్ని వాడుకోవాలని సూచిస్తున్నాడు. ఒకసారి వ్యాదిగ్రస్తుడి బాధను తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కట్ల శ్రీనివాస్ 17 ఏళ్ళ వరకూ చాలా చురుకుగా ఉన్నాడు. అంతేకాకుండా మంచి ఆర్టిస్ట్ కూడా. ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో ఒక రోజు తీవ్రమైన జ్వరం వచ్చింది. చాలా ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. హైదరాబాదులో చేసిన వైద్య పరిక్షలలో కండరాల క్షీణిత వ్యాధిగా గుర్తించారు. రోజురోజుకి వయస్సు పెరిగిన కొద్దీ శరీరంలో మార్పులు జరిగాయి. 25 సంవత్సరాలు వచ్చేవరకూ మంచం నుంచి లేవలేని పరిస్థితి. ఈ వ్యాధికి ఇప్పటికి నయం అయ్యే మందులు లేవు. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదుగా సోకుతుంది. ఇప్పటివరకూ యోగా, ప్రాణాయామంతో శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తనలాగా మరొకరు బాధపడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఈ వ్యాధి నయం కావాడానికి తన శరీరాన్ని పరిశోధనలు కోసం వాడుకోవాలని సూచిస్తున్నాడు.
ఇప్పటికీ మెరుగైన వైద్యం అందక.. వ్యాధి సోకిన కొన్ని సంవత్సరాలకే మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవం పనిచెయ్యదు. నీళ్ళు తాగినా, ఆహారం తీసుకున్నా ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. ఇన్ని కష్టాలని అనుభవిస్తూ శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు. అయితే ఈయన బాధని చూసి ఓ మహిళ 4 సంవత్సరాల క్రితం పెళ్ళి చేసుకుంది. అతని పాలన ప్రస్తుతం ఆమెనే చూసుకుంటుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడా ఈ మహిళ పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..
వైద్య రంగంలో ఆధునిక మార్పులు వస్తున్నా ఇలాంటి వ్యాధులు ఎందుకు నయం కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ముందుకు వచ్చి తన శరీరం పై ప్రయోగాలు చేసుకోవచ్చని చెబుతున్నాడు. గతంలో చనిపోవాలని నిర్ణయించుకున్న తాను.. ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి సంగతి ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ధైర్యంగా చెబుతున్నాడు. అంతేకాకుండా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి భరోసా కల్పిస్తూ వారికి కీలక సూచనలు చేస్తున్నాడు. ఈ వ్యాధి సోకిన తరువాత నలభై సంవత్సరాలు బ్రతకడం చాలా అరుదు. ఈ విషయంలో తన కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నాడు.
తన శరీరం ఏ మాత్రం సహకరించకున్నా.. ధైర్యంతో ముందుకు సాగుతున్నానని శ్రీనివాస్ అంటున్నారు. చాలా మంది ఈ వ్యాధి సోకితే మానసికంగా కోలుకోవడం లేదని అంటున్నారు. అందుకోసమే పరిశోధన కోసం తమ శరీరాన్ని ఇవ్వడానికి ముందుకి వచ్చినట్లు చెబుతున్నాడు శ్రీనివాస్. మరి అతని అభ్యర్థనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.