Kaleshwaram : మహా అద్భుతం అని చెప్పుకున్న కాళేశ్వరమే పార్టీ కొంప ముంచుతుందా అనే భయం.. BRSను వెంటాడుతోంది. ఇటీవలే మేడిగడ్డ, ఇప్పుడు సరస్వతి బ్యారేజ్ డ్యామేజ్ బయటపడటంతో.. ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయాలా? అని BRS నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు మణిహారం అని సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని కూడా ప్రతి సభలోనూ చెప్పారు. అంతేకాదు.. ప్రజల్ని బస్సుల్లో తీసుకెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించాలని ఆయన ఆదేశించడంతో.. అధికారులు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి ప్రాజెక్ట్ను చూపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగక ముందు వరకూ.. కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్స్ కుంగడం.. బీఆర్ఎస్ కు పెద్ద షాక్. అప్పటి నుంచి ఏ ఎన్నికల ప్రచార సభలోనూ KCR, కాళేశ్వరం ప్రస్తావన తేవడం లేదు. మేడిగడ్డ కుంగిన వార్త ప్రసారం కాకుండా కొంతవరకు మీడియాను మేనేజ్ చేసినా.. సోషల్ మీడియా ద్వారా విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఒక్క BRS లీడర్ కూడా కాళేశ్వరం గురించి పాజిటివ్గా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. KCR అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని ఏటీఎంలు ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదనే ప్రచారంతో కాంగ్రెస్ను ఇరుకున పెడదామనుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓట్లు తెచ్చి పెడుతుందని అనుకుంటే.. ఇప్పుడు అదే తమకు నష్టం తెచ్చేలా ఉందని చెవులు కొరుక్కుంటున్నారు.