– కాళేశ్వరం పద్దులపై ఘోష్ కమిషన్ విచారణ
– వేల కోట్ల లోన్లు తెచ్చినా ఆస్తులు, ఆదాయం ఏవీ?
– కాంట్రాక్టర్లకిచ్చిన బిల్లుల్లో పారదర్శకత ఏదీ?
– ఇన్ని తప్పులు జరుగుతుంటే ఎలా ఊరుకున్నారు?
– నిర్వహణ మొదలు బిల్లుల వరకు ప్రశ్నల వర్షం
– లోన్లు తెచ్చి, బిల్లులు ఆపి, ఎఫ్డీలు చేసిన వైనం
– ఆ డిపాజిట్ల మీద వడ్డీతో జీతాల చెల్లింపులు
– కాంట్రాక్టు సిబ్బందితో కార్పొరేషన్ నిర్వహణపై ఆశ్చర్యం
– నచ్చినట్లు పైసలు వాడిన మీలో దాని పూచీ ఎవరిది?
– ప్రశ్నలు దాటేసిన పద్మావతిపై ఘోష్ అసహనం
హైదరాబాద్, స్వేచ్ఛ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, నిధుల సేకరణ, వాటి అనుమతుల మీద జస్టిస్ పీసీ ఘోష్ పలు ప్రశ్నలు సంధించారు. కాగా, బుధవారం విచారణకు హాజరైన పలువురు అధికారులు ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటపెట్టారు.
ఆర్థిక అంశాలపై నజర్..
బుధవారం రోజున కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్ట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ కమిషన్ ముందు హాజరయ్యారు. వీరంతా గతంలో కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? దాని విధి విధానాలేంటి? అందులోని ఉద్యోగుల సంఖ్య, వారి జీత భత్యాలు, అవి చెల్లించిన పద్ధతిపై కమిషన్ దృష్టి సారించింది. అదే విధంగా ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సేకరణ ఎలా జరిగింది? కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారు? వంటి అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది.
Also Read: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!
ప్రశ్నల వర్షం..
కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనీ, దాని మీద వచ్చిన వడ్డీని కార్పొరేషన్ ఉద్యోగులు జీత భత్యాలకు, కార్యాలయాల నిర్వహణకు వాడినట్లు కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు కమిషన్కు తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ అప్పుల మీద వచ్చే వడ్డీలను జీతాలుగా ఎలా తీసుకున్నారని కమిషన్ ఛీఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ఈ కాళేశ్వరం కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను, డిప్యూటేషన్ మీద వచ్చిన వారినే నియమించారని ఆయన బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఏటా మీరు చెక్ చేస్తారా? ఎవరి ఆదేశాల మేరకు అప్పులు తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. చీఫ్ సెక్రటరీ అదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం అనంతరమే లోన్లు తీసుకున్నట్లు అప్పారావు వివరించారు. రుణాలు తీసుకున్నాక ఎవైనా అసెట్స్ డెవలప్ చేశారా? అని అడగగా, ఈ రోజు వరకు రూపాయి ఆదాయం గానీ, ఆస్తులు గానీ లేవని ఆయన వెల్లడించారు.
ఎవరు చెబితే బిల్లులిచ్చారు?
కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించేవారు? ఎవరి ఆదేశాల మేరకు చెల్లించారు? ఎవరికి ఎప్పుడు, ఎంత చెల్లింపులు చేశారనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టారా? అని పీసీ ఘోష్ అకౌంట్స్ అధికారులను ప్రశ్నించగా, నిబంధనల మేరకే తాము చెల్లింపులు చేశామని వారు వివరించారు. అనంతరం ‘కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కాగ్ నివేదికలోని అంశాలతో మీరు ఏకీభవిస్తారా?’ అని అధికారులను ప్రశ్నించగా, ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని అధికారులు తెలిపారు. ‘నేడు విఫల ప్రాజెక్టుగా నిలిచిన కాళేశ్వరం విషయంలో జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలకు, క్రమశిక్షణా రాహిత్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?’ అని పీసీ ఘోష్ అకౌంట్స్ విభాగపు సీనియర్ అధికారులను నిలదీయగా, దీనిపై తామేమీ స్పందించలేమని అధికారులు బదులిచ్చారు.
Also Read: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇది మీకు తగునా.. బిఆర్ఎస్ పై నెటిజన్స్ కామెంట్స్
ఆమెపై ఆగ్రహం
కాగా, కార్పొరేషన్ జనరల్ విభాగపు చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి.. కమిషన్ చీఫ్ అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, చెప్పలేను వంటి జవాబులిచ్చారు. దాదాపు మెజారిటీ ప్రశ్నలకు ఆమె అదే రీతిలో జవాబివ్వటంతో కమిషన్ చీఫ్ అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల సీనియర్ అధికారిగా విధులు నిర్వహించిన మీరు నాకేమీ తెలియదని చెప్పటమేంటి? ఖజానాపై అంత భారం పడుతున్నట్లు స్పష్టంగా కళ్లముందు కనబడినా, మీరు పట్టించుకోనట్లు ఎలా ఉండగలిగారు? అని పీసీ ఘోష్ ఆమెను అడిగినా, ఆమె మౌనంగా ఉండిపోయారు.