Kadem Project today news(Telangana news updates): నిర్మల్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం ప్రాజెక్టు డేంజర్ బెల్స్ మోగించింది. పైనుంచి వరద భారీగా వచ్చింది. ఆ వరద అంతకంతకూ పెరుగుతూ పోయింది. గేట్లు తెరిచి.. నీళ్లు దిగువకు వదలకపోతే అత్యంత ప్రమాదం తప్పదు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కడెం ప్రాజెక్టు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా.. సాంకేతిక లోపం 6 గేట్లు మొరాయించాయి. ఎంతకీ ఓపెన్ కాలేదు. ఆఫీసర్స్లో టెన్షన్ మొదలైంది.
చేసేది లేక మ్యాన్యువల్గా తెరిచేందుకు ట్రై చేశారు సిబ్బంది. అంతలోనే వారిపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. తేనెటీగలు కుట్టడంతో ముగ్గురు ఉద్యోగులు గాయపడ్డారు. అప్పటికే వరద పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.
విషయం తెలిసి.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్నాయక్ కడెం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ సహా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రతమతంగా ఉండాలని, ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
అధికారులు, స్థానిక యువకులు శ్రమించి.. అతికష్టం మీద ప్రాజెక్టు గేట్లు మ్యాన్యువల్గా ఓపెన్ చేశారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడితేనే.. ప్రాజెక్టుకు ముంపు తప్పినట్టని అంటున్నారు.
గతేడాది వర్షాలకు సైతం కడెం ప్రాజెక్టుకు పెద్ద ముప్పే తలెత్తింది. సామర్థ్యానికి మించి వరద చేరింది. గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. భారీగా కొట్టుకొచ్చిన చెట్లు, చెత్త పేరుకుపోయి.. గేట్లు మూసేందుకు కుదరలేదు. ప్రాజెక్టులోకి చేరిన వరద.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వెళ్లిపోయింది. జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం.. 700 అడుగులు కాగా.. దాదాపు 14 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించడంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు ఉద్ధృతికి 2 గేట్లు సైతం కొట్టుకుపోయాయి.
గతేడాది చేదు అనుభవం నుంచి అధికారులు గుణపాఠం నేర్చినట్టు లేరు. వానా కాలానికి ముందే మరమ్మత్తులు గట్రా చేయలేదు. ఈసారి కూడా 6 గేట్లు మొరాయించి.. ఆందోళన పెట్టించాయి. ప్రస్తుతానికి గేట్లను ఎలాగోలా ఎత్తారు కానీ.. మరి మూసేటప్పుడు మళ్లీ గతంలా కాకుండా చర్యలు తీసుకుంటారా?