Kacheguda Railway Station: నిరంతరం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి. ఎందరో ప్రయాణికులు, ఈ రైల్వే స్టేషన్ కేంద్రంగా రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అటువంటి రైల్వే స్టేషన్ సాయంత్రం కాగానే విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకోవడం సహజం. కానీ ఒక్కసారిగా వందల ఏళ్ల చరిత్ర గల ఈ రైల్వే స్టేషన్ సోమవారం రాత్రివేళ ఒకే రంగులో మెరిసింది. దీనితో రోజువారి మాదిరిగా కాకుండా, అసలు ఒకే రంగులో ఆ రైల్వే స్టేషన్ ఎందుకు కనిపిస్తుందో, తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్రయాణికులు. ఇంతకు స్టేషన్ ధగధగ మెరిసిన రంగు ఏమిటని అనుకుంటున్నారా.. గులాబీ రంగులో..
హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా గులాబీ రంగులో ధగధగ మెరిసింది. తెలంగాణలో గులాబీ రంగు అనగానే బీఆర్ఎస్ పార్టీ రంగుగా ప్రాచుర్యం ఉంది. అటువంటి సందర్భంలో ఈ రైల్వే స్టేషన్ గులాబీరంగు విద్యుత్ కాంతులతో ఎందుకు మెరిసిందో తెలుసుకుందాం.
రైల్వే స్టేషన్ లు కేవలం ప్రయాణికుల రవాణా వ్యవస్థ గానే కాకుండా, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా భాగస్వామ్యం కావాలన్నది కేంద్రం ఆకాంక్ష. అందుకే ప్రత్యేకమైన రోజులలో రైల్వే స్టేషన్స్ మనకు, పలు రంగుల విద్యుత్ కాంతులతో కనిపిస్తుంటాయి. ఆగస్ట్ 15, జనవరి 26, ఇంకా రాష్ట్రాల అవతరణ దినోత్సవంలో రైల్వే స్టేషన్స్ త్రివర్ణ పతాకం రంగులలో మెరుస్తూ.. దేశభక్తిని, మహనీయుల త్యాగాలను లోకానికి చాటి చెబుతాయి.
ఈ నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్ సోమవారం రాత్రి గులాబీ రంగులో కనిపించేందుకు ఓ పెద్ద కారణమే ఉంది. అదే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడం. ఈ వ్యాధికి సింబాలిక్ గా పింక్(గులాబీ రంగు) రిబ్బన్ ను చిహ్నంగా గుర్తిస్తారు వైద్యులు. మహిళలు నేటి కాలంలో ప్రధానంగా ఎదుర్కొనే వ్యాధులలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అటువంటి వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రతి అక్టోబర్ లో పింక్ వీక్ నిర్వహిస్తారు. అందులో భాగంగానే రైల్వే స్టేషన్స్ పింక్ రంగులో గల విద్యుత్ దీపాలతో మెరుస్తూ.. వ్యాధిపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలకు మద్దతు ఇవ్వాలన్నది కూడా.. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా.
అందుకే హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్, ఏపీ లోని విజయవాడ రైల్వే స్టేషన్స్ గులాబీ రంగులో రాత్రివేళ ప్రయాణికులకు కనిపించాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ సోమవారం రాత్రి గులాబీ రంగులో కనిపించగా.. అసలు కారణాన్ని తెలుసుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. చివరకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు, సింబాలిక్ గా గులాబి రంగులో రైల్వే స్టేషన్ ధగధగ మెరిసిందని అధికారులు వారికి వివరించారు. ఏది ఏమైనా లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్స్, ఇలా వ్యాధులపై అవగాహన కల్పించడం అభినందనీయం.. ప్రశంసనీయం.