KA Paul: హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని తక్షణం హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ తరపున న్యాయవాదులు కోరగా, ఉన్నపళంగా కూల్చివేతలు ఆపలేమని కోర్టు వ్యాఖ్యానించింది. వాదనల అనంతరం ప్రతివాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
పాల్ వాదన ఇదీ..
తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందనీ, అయితే, సరైన విధానం లేకుండా అది ముందుకు పోవటం వల్ల పలు కొత్త సమస్యలు వస్తున్నాయని పార్టీ ఇన్ పర్సన్గా కేఏ పాల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు తప్ప దీని గురించి చట్టసభలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కనుక, హైకోర్టు జోక్యం చేసుకుని వెంటనే ఆ జీవో 99 మీద స్టే విధించాలని కోరారు. అదే సమయంలో ఏవైనా అక్రమ కట్టడాలు కూల్చివేతకు 30 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయాలపై క్లారిటీ వచ్చే వరకు హైడ్రా కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పాల్ కోర్టును కోరారు.
ప్రభుత్వ వాదన..
ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షించటమే లక్ష్యంగా గత జులై 19న జీవో 99 ద్వారా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని, దీనికోసం ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతోనే ఆర్డినెన్స్ను తీసుకొచ్చిందని, ఈ ఆర్డినెన్స్ మీద గవర్నర్ వ్యక్తం చేసిన అనుమానాలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వివరణ ఇచ్చారని, ప్రభుత్వ వివరణలో సంతృప్తి చెందాకే గవర్నర్ దీనిని ఆమోదించారని, కనుక హైడ్రా చట్టబద్ధత మీద అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు.
14న వింటాం
ఉభయుల వాదనలు విన్న తర్వాత, కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ఈ అంశంలో పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాల మీద ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వం, హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని, ఈ కేసును ఈ నెల 14న మరోసారి విచారిస్తామని ప్రకటించింది.