Jurala project flood water irrigation officers warns
గద్వాల జిల్లాకే గర్వకారణమైన జూరాల ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో పాటు పైనున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో జూరాల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముందు జాగ్రత్త చర్యగా గురువారం ఉదయం ప్రాజెక్టు అధికారులు 46 గేట్లను ఎత్తివేశారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం మూడు వేల నూట పద్దెనిమిది పాయింట్ యాభై ఒక్క మీటర్లు కాగా..ప్రస్తుతానికి అక్కడ మూడు వందల పదహారు మీటర్ల స్థాయికి చేరుకుంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర అల్మెట్టి డ్యామ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పరిసర ప్రాంత గ్రామస్తులను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నెట్టెంపాడు,భీమా ప్రాజెక్టులకు నీటిని లిప్ట్ ల ద్వారా ఎత్తిపోస్తున్నారు.
రైతన్నల హర్షం
జూరాల దిగువన ఉన్న భీమా ప్రాజెక్టు ద్వారా మొత్తం కోటి తొమ్మిది లక్షల ఎకరాలకు నీరందనుంది. అలాగే కల్వకుర్తి లిప్టింగ్ ద్వారా మూడు కోట్లకు పైగా ఎకరాలకు నీరు అందనుంది. దీంతో పరిసర ప్రాంతాల రైతులు వరినాట్లకు సిద్ధం అవుతున్నారు. ఆరు తడి పంటలను ప్రోత్సహించాలని అధికారులు రైతులకు సూచనలిస్తున్నారు. అయితే దండిగా వర్షాలు వానలు వచ్చినా తగినంత నీటి సామర్థ్యపు నిల్వలు లేకపోవడం దురదృష్టకరం. ప్రతి ఏడాది వర్షాకాల ఆరంభంలోనే జూరాలకు ఎగువనుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రాజెక్టులో పూడిక తీత పనులు లేక తగినంత నీటిని నిల్వ చేయలేకపోతున్నారు అధికారులు. కేవలం పదేళ్లకొకసారి మాత్రమే పూడిక తీత పనులు చేపట్టడంతో నీటిని ఎక్కువగా నిల్వ చేయలేకపోతున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వలు లేక రెండో పంట వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.