ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి హస్తంగూటికి చేరారు. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరాలని జూపల్లి కృష్ణారావు తొలుత భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయారు. తెలంగాణలో వర్షాల వల్ల జూలై 20, 30న రెండుసార్లు ప్రియాంక పర్యటన వాయిదా పడింది. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దీంతో జూపల్లి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
లోక్ సభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణలో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులలో జోష్ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తున్నాయి.