Jubilee Hills Crime : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్.. రేప్ కేసులో ఇరుక్కున్నారు. పనిమనిషిపై లైంగిక దాడికి పాల్పడిన మురళీ ముకుంద్, ఆయన కొడుకు ఆకాష్ పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదైంది. తన వీడియోలు తీసి, బెదిరించి అత్యాచారం చేశారని బాధిత యువతి ఫిర్యాదులో తెలిపింది.
మురళీ ముకుంద్ కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి వివాదాల్లో మురళీముకుంద్ ఇరుక్కున్నారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో కార్యదర్శిగా ఉన్న ఆయన.. అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి. కార్యదర్శిగా నిధులు కాజేశారని గతంలో కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ కేసులో మురళీముకుంద్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
గతంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తనిఖీకి వచ్చిన విద్యాశాఖ అధికారులపైనా మురళీముకుంద్ దాడి చేశారనే ఆరోపణ ఉంది. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజులు వసూలు చేశారని..
గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మురళీముకుంద్కు ఉన్న పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు తన ఇంట్లో దొంగతనం చేసిందంటూ మురళీ ముకుంద్ కొత్త కథ అల్లుతున్నారు. తనకున్న పలుకుబడితో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాధితురాలు.. అత్యాచారం కేసు పెట్టినా ఇంతవరకూ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోకపోవటంతో.. ఈ వాదనలకు బలం చేకూరుతోంది.