Congress : కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూనే ఇతర పార్టీల నుంచి హస్తంగూటికి చేరేవారికి ఆహ్వాన పలుకుతోంది. ఇప్పటికే ఖమ్మంలో కీలక నేత తుమ్మల చేరికకు లైన్ క్లియర్ కాగా.. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు.
తన అనుచరులతో కలిసి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన జిట్టా.. ఆయన సమక్షంలో పార్టీలో చేరిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆదివారం తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి బహిరంగ సభలోనే సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జిట్టా చేరతారని అందరూ భావించారు.
అయితే పార్టీ స్టార్ క్యాంపెయినర్ , స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అంగీకారంతోనే పార్టీలో చేరాలని అధిష్టానం జిట్టాకు సూచించింది. ఆ క్రమంలోనే పార్టీ బహిరంగ సభకు ఒక రోజు ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడానికి ముందు కోమటిరెడ్డిని జిట్టా బాలకృష్ణారెడ్డి కలిశారు.