Jhansi Reddy Seriously injured: అక్కడ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా కాంగ్రెస్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు వేదిక పైకి ఎక్కి అభివాదం చేస్తున్నారు. ఇదే సమయంలో చాలామంది ఆ వేదికపైకి ఎక్కారు. దీంతో ఆ వేదిక కుప్పకూలింది. ఈ సంఘటనలో సదరు మహిళా కాంగ్రెస్ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ లో జరిగింది.
Also Read: ఫ్యామిలీ డిజిటల్ కార్డుని ప్రారంభించిన సీఎం.. ఇదే మీ ఆధారం, రక్షణ కవచం కూడా
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి కాసం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటుచేసిన వేదికపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఎక్కువమంది ఆ వేదికపైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్న ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఝాన్సీరెడ్డితోపాటు పలువురికి కూడా గాయలైనట్లు తెలుస్తోంది.
Also Read: బీఆర్ఎస్పై సీఎం ఫైర్.. బావ బావమరుదుల ఆక్రమణలు, ఈటెలకు ఆ వాసన పోలేదంటూ
అనుకోకుండా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, ప్రజలు భారీగా ఆసుపత్రికి వెళ్తున్నారు. అనంతరం ఆమెను పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఝాన్సీరెడ్డి కాలు విరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా హాజరయ్యారు. షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తున్న క్రమంలో ఝాన్సీరెడ్డితో పాటు ఆమె కూడా అదే స్టేజీపై ఉన్నారు. అయితే, ప్రియాంక మోహన్ తృటిలో తప్పించుకున్నారని, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కానీ, ఝాన్సీరెడ్డితోపాటు పలువురికి కూడా తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కాగా, ఝాన్సీరెడ్డి… పాలకుర్తి కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్తమ్మ. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్వినీరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఝాన్సీరెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రాల్లో ఆమె ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్ర నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఝాన్సీరెడ్డికి ఎలా ఉందంటూ ఆరా తీస్తున్నారు. ఇటు పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు, ప్రజలు.. ప్రమాదానికి గురైన తమ నేత త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.