Jeevanreddy : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై వరంగల్ జిల్లాలో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. షర్మిల విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా మహిళలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. ధ్వంసం చేసిన చోటే వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణమని జీవన్ రెడ్డి అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా యాత్రలు చేపడితే అనుమతులున్నా పోలీసులు అడ్డుకోవడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు.
వైఎస్ షర్మిల చేపట్టిన యాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పోలీసులు ఉండగానే షర్మిల వాహనాలకు నిప్పు పెట్టడంపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. అధికార పార్టీ కార్యకర్తలు ఇలా చర్యలకు పాల్పడటం తగదన్నారు.