జేఈఈ మెయిన్ సెషన్ -1 (JEE Main Session-1) పరీక్షలు మొదలయ్యాయి. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు పేపర్-2 పరీక్ష నిర్వహించగా.. పేపర్-1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు.
27న జరిగే పేపర్-1( బీఈ/ బీటెక్) పరీక్షకు జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల్ని (JEE Main Admit Cards) విడుదల చేశారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుల్ని ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ https://jeemain.nta.ac.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్స్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డుల్ని పొందొచ్చు.
దేశవ్యాప్తంగా జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ (JEE Main) పేపర్ 1 పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మొదటి పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉండగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5లక్షల మందికి పైగా ఉన్నారు. దేశంలోని ఎన్ఐటీ (NIT)లు, ట్రిపుల్ (EEE), ఐటీ(IT)ల్లో బీటెక్ (BTECH) కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ ర్యాంకులే ప్రామాణికం.