Jalagam Venkat Rao : బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీలను ఆయనకు అందించారు . ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని జలగం వెంకట్రావు కోరారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ను జలగం వెంకట్రావు కలవనున్నారు.
వనమాపై అనర్హత వేటుతో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా పొందాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆయనకు లభిస్తాయి. 2018 ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో వనమా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు వనమా చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి జలగం వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాత వనమా గులాబీ గూటికి చేరారు.
వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ హైకోర్టును జలగం ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జలగం తాను ఎమ్మెల్యే పదవి చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. అలాగే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సీఎం కేసీఆర్ నాయకత్వలో పనిచేశానని , ఇప్పుడు పనిచేస్తానని స్పష్టం చేశారు.