Jagguswamy : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తనను అక్రమంగా ఇరికించారని హైకోర్టులో కేరళకు చెందిన జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ వేశారు. తనకు సిట్ జారీ చేసిన 41-ఏ సీఆర్పీసీ, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. జగ్గుస్వామికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించింది. తుషార్, రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ ప్రయత్నించారని అభియోగాలున్నాయి. ఈ కేసులో జగ్గుస్వామి ప్రమేయం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే జగ్గుస్వామికి సిట్ 41-ఏ సీఆర్ పీసీ నోటీసులు ఇచ్చింది. జగ్గుస్వామి విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో జగ్గుస్వామి ఈ రెండు నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.