Jaggareddy Warning to KTR: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామని చెబితే.. మేము చూస్తూ ఊరుకుంటాం అని అనుకుంటున్నావా కేటీఆర్ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్రాంతంలో.. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని కూల్చివేస్తామని కేటీఆర్ నిన్న సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా జగ్గారెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
తమ ధైర్య, సాహసాల ముందు కేటీఆర్ ఎంత? అని పూచిక పుల్లను తీసిపడేసినట్లు మాట్లాడారు. కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినవాడిలా మాట్లాడుతున్నాడని, 5 సంవత్సరాల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. విగ్రహాన్ని కూల్చివేయాలంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, ఐదేళ్ల వరకూ వారికి ఆ అవకాశమే లేదని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ.. విగ్రహ రాజకీయాలకు సీఎం రేవంత్ చెక్
యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రి పదవి చేసినపుడు ఏం చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లినపుడు సోనియాగాంధీకి గులాం గిరి చేయలేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల కోసం.. రాజీవ్ గాంధీ బలిదానమయ్యారన్న విషయాన్ని మరచిపోయి.. నేడు విగ్రహ రాజకీయాలకు తెరలేపడం సబబు కాదని మండిపడ్డారు.
రాజీవ్ గాంధీ హయాంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆయన తీసుకొచ్చి టెక్నాలజీలోనే చదువుకున్న కేటీఆర్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడని.. ఆ ధన్యవాదాలు తెలిపే గుణగణాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకోవడం మంచిదని, అప్పుడైనా ఏ ఇష్యూపై ఏం మాట్లాడాలో తెలుస్తుందని సలహా ఇచ్చారు. తెలంగాణలో విగ్రహ రాజకీయాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.