Jaggareddy Slams PM Modi: ప్రధాని మోదీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ దేశం కోసం, దేశ భవిష్యత్ కోసం అనేక నిర్మాణాలు, కట్టడాలు చేపట్టారన్నారు. కానీ.. మోదీ మాత్రం వాటన్నిటినీ అమ్మేస్తున్నారని విమర్శించారు.
నెహ్రూ ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంట్ లేదు.. ప్రాజెక్టులు కూడా లేవన్నారు. దేశంలో నెహ్రూ హయాంలో ప్రాజెక్టులు కట్టారన్నారు. అదేవిధంగా విద్యుత్ ను కూడా తీసుకువచ్చారని చెప్పారు. ఎఫ్ సీఐని ఏర్పాటు చేసి దేశాన్ని ఆకలి చావుల నుంచి కాపాడింది నెహ్రూ మాత్రమేనని ఆయన అన్నారు. పదేళ్లు పని చేసిన మోదీ కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఆస్తులు పోగు చేస్తే.. మోదీ మాత్రం వాటిని ధారాదత్తం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూ ప్రాజెక్టులు కట్టే పని పెట్టుకున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. దూరదృష్టితోనే ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తికి నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని కూడా నెహ్రూ ప్రోత్సహించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టలేదని ఎవరైనా చెప్పగలరా? అంటూ ఆయన సవాల్ విసిరారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విపక్ష నేతలు, మీడియా యజమానుల ఫోన్లను కూడా వదల్లే!
అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారంపై కూడా జగ్గారెడ్డి మాట్లాడారు. విశాఖ ఉక్కును తమ కాంగ్రెస్ తెస్తే.. దానిని మోదీ మాత్రం అమ్మకానికి పెట్టారని జగ్గారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ లో పదవి అడిగే పరిస్థితి ఉండదని.. బీజేపీలో అయితే పదవులు అడిగితే ఉన్న పదవి కూడా పోతదని ఆయన విమర్శించారు. కానీ, కాంగ్రెస్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఎవరైనా సరే పదవులు అడిగే స్వేచ్ఛ కేవలం కాంగ్రెస్ లో మాత్రమే ఉంటుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.