Telangana: ఆదిలాబాద్ అంటే వెనుకబడిన ప్రాంతం. ఆదిలాబాద్ అంటే గిరిజనుల జిల్లా. ఆదిలాబాద్ అంటే అభివృద్ధి కానరాని మారుమూల ఇలాఖా. ఇన్నాళ్లూ ఆదిలాబాద్ గురించి అంతా ఇలానే మాట్లాడుకునే వారు. కానీ, ఇప్పుడు నసీబు మారింది. ఆదిలాబాద్ సైతం డెవలప్ అవుతోంది. త్వరలోనే ఆదిలాబాద్ లో ఐటీ టవర్ సైతం ఏర్పాటు కానుందంటే మామూలు విషయమా.
అవును, ఆదిలాబాద్ లో ఐటీ టవర్ రాబోతోంది. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో టవర్ నిర్మిస్తున్నారు. మావల మండలంలోని బట్టిసావర్గంలో మూడెకరాల స్థలం కేటాయించారు. టవర్ నమూనా చిత్రాలను కూడా తయారు చేశారు. నిర్మాణం కోసం ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసింది. 40 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే ఐటి టవర్ లో వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో 800 నుంచి ఐటీ ఇంజినీర్లు, మరో 200 మంది ఇతర ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటీ టవర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది.