Malla Reddy: రెండు రోజులుగా ఐటీ రైడ్స్. 50 బృందాలతో సెర్చింగ్. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు, సమీప బంధువుల ఇళ్లలో సుదీర్ఘంగా తనిఖీలు జరుగుతున్నాయి. పారా మిలటరీ బలగాల రక్షణలో ఐటీ సిబ్బంది పకడ్బందీగా సోదాలు చేస్తున్నారు. అంతా ప్రీ ప్లాన్డ్ గానే రైడ్స్ జరిగాయని అంటున్నారు. మూడు నెలలుగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలపై కన్నేసి ఉంచింది ఐటీ శాఖ. ఆయన బ్యాంకు లావాదేవీలను పరిశీలించింది. వన్ ఫైన్ డే.. నేరుగా మల్లారెడ్డి ఇంటికి వచ్చారు ఐటీ అధికారులు. తామ దగ్గర భూములు ఉన్నాయి.. మీరు కొంటారా? అని అడిగారు. అర్జెంటుగా డబ్బులు కావాలి, ధర తక్కువే, మనీ బ్లాక్ లో ఇచ్చినా ఓకే.. అంటూ మంత్రి ముందు ప్రపోజల్ పెట్టారు. అయితే, తానిప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదని మల్లారెడ్డి వారితో చెప్పారు. కట్ చేస్తే…
మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సోదాలు పక్కాగా జరుగుతుండటం, ఇప్పటికే 4 కోట్లకు పైగా డబ్బులు దొరకడం.. ఎలక్ట్రానిక్ లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు కూడా చిక్కడంతో.. మల్లారెడ్డి కుటుంబంలో బెదరు మొదలైనట్టుంది. ఏళ్లుగా సంపాదించి.. గుట్టుగా దాచిన గుట్టంతా.. ఐటీ దాడుల్లో దొరికిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ ని కలవరపాటుకు గురి చేస్తోంది.
ఐటీ సోదాలతో కలత చెందిన మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి చాతిలో నొప్పి రావడం ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐటీ అధికారులు, పారా మిలటరీ ఫోర్సు తన కుమారుడిని ఒత్తిడికి గురిచేశారని, శారీరకంగానూ హింసించారని మల్లారెడ్డి మండిపడుతున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని ఐటీ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది.
అటు, మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు సైతం విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వారి హడావుడి చూసి.. వారి సోదాల్లో దొరుకుతున్నదంతా చూసి.. ఆ ఇంటి పనిమనిషికి ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఆ వర్కర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో.. ఆయన ఇంట్లోని వ్యక్తులు వరుసగా అస్వస్థతకు గురై.. హాస్పిటల్ పాలవుతుండటం చర్చనీయాంశమైంది. ఐటీ రైడ్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో.. సోదాల్లో ఎంతెంత లోగుట్టు బయటపడుతోందో.. అనే ఆసక్తి నెలకొంది.