IT Raids : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉంది. ఓవైపు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూనే ప్రత్యర్థులను ఎలా ఓడించాలనే వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రచారంలో కీలక నేతలు ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన మంచి పనులు ప్రత్యర్థులు లోపాలను ఎత్తి చూపుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఐటీ, పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి.
అందరూ ఊహించినట్టే జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో అటు కేంద్ర సంస్థలు కానీ.. రాష్ట్ర పోలీసులు కానీ దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఎన్నికలకు ముందు ప్రతి రాష్ట్రంలో కేంద్ర సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం మహేశ్వరం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కిచెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంతోపాటు బడంగపేట్ మేయర్ పారిజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లోనూ పోలీసుల తనిఖీలు చేపట్టారు. పలు పత్రాలను పరిశీలించారు.
అయితే పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర సంస్థల దాడులపై కామెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లోని పత్రాలను పరిశీలించారు. ఖమ్మంలోని శ్రీసిటీలోగల తుమ్మల నివాసంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
దాడుల పేరుతో కాంగ్రెస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సాయం లేకుండానే సాధ్యం కాదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలుస్తున్నా.. కేసీఆర్ కుటుంబంపై దాడులు జరగకపోవడం దేనికీ సంకేతమని ప్రశ్నిస్తున్నారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుందంటున్నారు హస్తం పార్టీ నేతలు.