IT Raids : హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో, ఆఫీసులో, దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వ్యాపారులు భారీగా పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
వస్త్రవ్యాపారుల టార్గెట్ గా తాజాగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం, వర మహాలక్ష్మి వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కళామందిర్ గ్రూప్ ఛైర్మన్ ఇళ్లు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనే 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఐటీ దాడులు కామన్ గా మారాయి. టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఇటీవల పలుమార్లు సోదాలు జరిగాయి. మైత్రీ మూవీస్, డైరెక్టర్ సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేశారు. అంతకుముందు పలు రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేశారు.