MallaReddy: 400 మంది ఐటీ ఆఫీసర్స్. 65 బృందాలతో సెర్చింగ్. తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి తరలివచ్చిన అధికారులు. ఒకేసారి మూకుమ్మడిగా రైడ్ చేశారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యాసంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. తెలుగునాట బిగ్గెస్ట్ ఐటీ రైడ్ ఇది. రెండురోజులుగా సినిమాటిక్ స్టైల్ లో సాగింది. ఇంతకీ ఐటీ రైడ్స్ లో ఏం దొరికింది? అక్రమాలు జరిగాయా? అధికారులు ఏం చెబుతున్నారు? అనేది ఆసక్తికరం.
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించినట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించారు. లెక్కల్లో చూపని ఆ నగదును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని తేల్చారు. మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా అదే మనీని ఖర్చు చేసినట్టు ఐటీ అధికారులు ఐడెంటిఫై చేశారు.
ఇప్పటి వరకైతే 6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే, ఇంకా పలు లాకర్లు తెరవాల్సి ఉందని, అవి తెరిస్తే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని అంటున్నారు ఐటీ సిబ్బంది. భూముల విలువ కూడా తక్కువ చేసి చూపించారని.. మార్కెట్ వ్యాల్యూతో లెక్కేయాల్సి ఉందని చెబుతున్నారు.
అటు, మంత్రి మల్లారెడ్డి సైత ఐటీ సోదాలపై స్పందించారు. ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని అన్నారు. కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు అందజేశామని.. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నామని చెప్పారు. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు.