IT Raids :హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 36 చోట్ల తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. వంశీ రామ్ బిల్డర్స్ ఛైర్మన్ తిక్కవరపు సుబ్బారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ ఛైర్మన్ బావమరిది జనార్ధన్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. జనార్ధన్ రెడ్డి వంశీరామ్ బిల్డర్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు.హైదరాబాద్, విజయవాడతోపాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
ఏపీలోనూ ఐటీ సోదాలు అలజడి రేపుతున్నాయి. విజయవాడలో వైఎస్ఆర్ సీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ ఐటీ దాడులతో విజయవాడ సోదాలకు లింకులున్నాయి. బంజారాహిల్స్ లోని దేవినేని అవినాష్ స్థలాన్ని వంశీరామ్ బిల్డర్స్ డెవలప్మెంట్కు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
ఇలా ఏకకాలంలో అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఐటీ అధికారులు దాడులకు దిగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ దాడులు జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలకు దిగడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.