TRS: ఈడీ, ఐటీ, సీబీఐ.. తెలంగాణలో ముప్పేట దాడి చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే వారి టార్గెట్ గా కనబడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో మొదలైంది ఈ దూకుడు. ఆ తర్వాత గంగుల, తలసాని, మల్లారెడ్డి.. తర్వాత ఎవరు? అనే ప్రశ్న దగ్గర ఆగిపోయింది. ఆ నెక్ట్స్ ఆమెనేనా? లేక, అతనా?
గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి.. ఆర్థిక, అంగ బలం మెండు. అలాంటి బాహుబలిలపైనే జాతీయ దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతుంటే.. బడా వ్యాపారులైన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకుల్లో టెన్షన్ మొదలైంది. కేసీఆర్ వర్సెస్ కేంద్రం గొడవలో.. మధ్యలో తాము బలైపోతామేమో అనే భయం వారిని వెంటాడుతోంది. ఆ ముగ్గురి తర్వాత ఎవరనే ప్రశ్నగులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
గులాబీ బాస్ సిట్ పేరుతో.. బీజేపీతో వైరాన్ని తెగేదాకా లాగుతున్నారు. కేసీఆరే టార్గెట్ గా.. ముందుగా మంత్రులపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. దారికొస్తే సరే సరి.. లేదంటే అసలు లీడర్ల సంగతి పడతామనేలా కేంద్రం స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తోందని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు చూస్తుంటే.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ కూతురు కవిత అరెస్టు తప్పదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిత టార్గెట్ గానే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు నడుస్తోందని.. నెక్ట్స్ వికెట్ కేసీఆర్ కూతురే అవుతుందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సిట్ దూకుడు తగ్గకపోతే.. కవిత, కేటీఆర్ ఆస్తులపైనా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మల్లారెడ్డి మీద చేసినట్టుగానే.. గతంలో కవిత, కేటీఆర్ లపై కూడా రేవంత్రెడ్డి పలుమార్లు ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. అక్రమ ఫామ్హౌస్లు, భూ కబ్జాలు, ఇసుక దందా, కే టాక్స్.. ఇలా పలు అంశాలపై ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థలకు రేవంత్ రెడ్డి అందించారు. మల్లారెడ్డితో సహా ముగ్గురు మంత్రుల మీద జరిగినట్టే.. ఏదో ఒక కేసులో టీఆర్ఎస్ బిగ్ బాసులపైనా ఈడీ, ఐటీ ఫోకస్ చేస్తే.. పార్టీ పరిస్థితి ఏంటి? కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది? అనే రాజకీయ ఉత్కంఠ నెలకొంది.