BJP: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ. కొంతకాలంగా సాగుతోందీ ప్రచారం. ఎన్నికలకు ముందు తన టీమ్ ను మార్చడం మోదీకి అలవాటే. ఫ్రెష్ లుక్ తో ఎలక్షన్ కు వెళ్లాలనేది ఆయన లెక్క కావచ్చు. కారణమేదైతేనేం.. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగొచ్చనే అంటున్నారు.
ఆ న్యూస్ ఇలా వచ్చిందో లేదో.. మనోళ్లు రకరకాల ఊహాగానాలు వండివార్చేస్తున్నారు. ఈసారి తెలంగాణకి మరో కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ జోస్యం చెప్పేస్తున్నారు. నిజమే, రావొచ్చు కూడా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయో.. ఏ స్టేట్ ను అయితే బీజేపీ టార్గెట్ చేస్తుందో.. అక్కడి లీడర్లకు పార్టీలో, ప్రభుత్వంలో మాగ్జిమమ్ పదవులు కట్టబెట్టడం కమలనాథుల స్ట్రాటజీ. గతంలో బెంగాల్ విషయంలో ఇలాంటి గేమ్ ప్లానే అమలు చేస్తే.. బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు తెలంగాణ నుంచి మరోకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఉన్నది ఐదుగురు ఎంపీలు. ఐదుగురిలో ఇద్దరికి కేంద్రమంతి పదవులు అంటే పెద్ద నెంబరే. ఇదొక్కటే చిన్న ఆటంకం. లేదంటే, రెండో మినిస్టర్ పోస్టు పక్కా అంటున్నారు.
తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావులు లోక్ సభకు.. లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అందరికీ అందరూ కేంద్రమంత్రి పదవికి తగినవారే. ఎవరికి ఇచ్చినా పార్టీని మరింత బలోపేతం చేసేవాళ్లే.
కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్నారు. అయితే, ఎన్నికల సమయంలో కీలక నేతలను ప్రభుత్వం నుంచి తప్పించి.. వారి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవడం బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వస్తోంది. ఆ లెక్కన త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో కిషన్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ఆ నలుగురి నుంచి ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం కూడా లేకపోలేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. కేంద్రమంత్రి పదవి ఇస్తే.. అది ఆయన స్పీడుకు స్పీడ్ బ్రేకర్ గా మారే అవకాశమే ఎక్కువ. అందుకే, బండికి కేబినెట్లోకి ఛాన్స్ ఉండకపోవచ్చు. లక్ష్మణ్, అర్వింద్, బాపురావులో ఒకరికి కేంద్రం ప్రభుత్వంలో పోస్టు దక్కొచ్చని అంటున్నారు. మరి, ఆ ఒక్కరు ఎవరో!?