BJP News Telangana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అందుకనుగుణంగానే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలు చేరితేనే బీజేపీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే చర్యలను వేగవంతం చేసింది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. అలాంటి నేతలకు కాషాయ కండువా కప్పాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.
బీజేపీ అధిష్ఠానం హైదరాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. 4 రోజులుగా ఇక్కడే మకాం వేసిన ఢిల్లీ పెద్దలు… కోర్ కమిటీలో చేరికలపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, శివప్రకాశ్… తెలంగాణలోనే ఉన్నారు. BRS, కాంగ్రెస్లోని అసంతృప్త నేతల వివరాలు తయారు చేయాలని తీర్మానించారని తెలుస్తోంది. ఈ నెల 30 లోపు బూత్ కమిటీలు వేయాలని ఆదేశించారు.
ఈ నెల 23న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ వేదిక నుంచి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా పర్యటన వేళ పలువురు కీలక నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సడెన్ గా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తినకు వెళ్లారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీకానున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్లపై చర్చించేందుకే వెళుతున్నట్లు బండి సంజయ్ చెప్పారు. పార్టీ పరంగా ఎవరినీ కలవడం లేదన్నారు. అయితే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అమిత్ షా పర్యటన, పార్టీలో నేతల చేరికలపై చర్చించేందుకు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.