Y S Sharmila News : తెలంగాణలో ఎంత పోటీనో..! ఓవైపు అధికార పార్టీ బీఆర్ఎస్. ప్రత్యామ్నాయం తామేనంటూ కాంగ్రెస్, బీజేపీ. ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు ఇంకొన్ని చిన్న పార్టీలు. వీటన్నింటి మధ్య తాను కూడా ఉన్నానంటూ వస్తున్నారు వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ ఆడబిడ్డనంటూ షర్మిల చేస్తున్న సౌండ్ కాస్త గట్టిగానే వినిస్తోంది. అది ప్రధాని మోదీకి కూడా వినిపించింది. అందుకే, వైఎస్ జగన్ కలిసినప్పుడు మోదీ, దావోస్ వెళ్లినప్పుడు కేసీఆర్ ప్రశ్నించారు. ఆ సౌండ్ ఇప్పుడు కర్నాటకలోని కాంగ్రెస్ కూడా గట్టిగానే వినిపించింది. అందుకే, కర్నాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ప్రియాంక గాంధీ నుంచి కూడా షర్మిలకు కొన్ని ప్రపోజల్స్ వచ్చినట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. కాని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఏ సౌండ్ లేదు. నిజానికి ఇక్కడ సౌండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జరగాల్సిన కార్యం కామ్గా జరిగిపోవాలంతే..! అందుకేనా షర్మిల నుంచి ఈ సైలెన్స్?
తెలంగాణలో ఎన్నికలకు చాలా కొద్ది సమయమే ఉంది. ఏ సౌండ్ చేయాలన్నా ఇప్పుడే చేయాలి. ప్రభుత్వంపై ఒంటి కాలితో లేవాలి. కాని, ఎందుకనో వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. ఈమధ్య వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో కలపాలనే ప్రతిపాదన వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దాన్ని ఖండించేందుకు మాత్రమే బయటికి వచ్చి ఇక ఆ తరువాత నుంచి కనిపించలేదు. తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. ఆ పాదయాత్ర కారణంగానే షర్మిల వాయిస్ గట్టిగా వినిపించింది. మరి ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఎందుకని షర్మిల సైలెంట్గా ఉన్నారనేదే ప్రశ్న.
లోలోన ఏదైనా ప్లాన్ వేస్తున్నారా? ఊహించని నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? అటు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి, ఇటు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆహ్వానాలు, ఆశీర్వాదాలు ఉన్న ఏకైక పార్టీ షర్మిలదే. క్షేత్రస్థాయిలో షర్మిల పార్టీకి బలం ఎంత ఉందో ఇప్పటికీ ఓ లెక్క లేకపోయినా… ఈ రెండు జాతీయ పార్టీలు వెంటపడుతున్నాయి. భవిష్యత్తు బాగుంటుందని, పార్టీని కలిపేస్తే బాగా చూసుకుంటామనే హామీలు గట్టిగానే వస్తున్నాయి. సో, వీటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. షర్మిల ఏ పార్టీలో చేరినా తగిన గుర్తింపు, గట్టి ఉనికి కోరుకుంటారు. అలాంటి హామీలు ఎవరైనా ఇచ్చారా అనేది కూడా షర్మిల నిశ్శబ్దంలోంచే సమాధానం రావాల్సి ఉంది.