Congress: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అందరి టార్గెట్ అయ్యారు. అటు పార్టీలో సీనియర్లు స్పీడ్ బ్రేకర్లుగా మారారు. ఇటు బీఆర్ఎస్ పదే పదే ఆయన్ను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు బీజేపీ సైతం ఫైర్బ్రాండ్ లీడర్పై పొలిటికల్ గన్ ఎక్కుపెట్టింది.
TSPSC పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్, బీజేపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందంటూ.. రేసులో ముందు నిలిచారు రేవంత్. లేట్గా ఎంట్రీ ఇచ్చిన కమలనాథులు.. చాలావేగంగా రేవంత్రెడ్డిని దాటేశారు. టెన్త్ పేపర్ ఘటనలో బండి సంజయ్ అరెస్ట్, హనుమకొండలో నిరుద్యోగ మార్చ్తో బీజేపీకి బాగా మైలేజ్ వచ్చింది. కౌంటర్గా కాంగ్రెస్ సైతం నిరుద్యోగ నిరసన సభలకు పిలుపు ఇవ్వడంతో.. బీజేపీ ఫోకస్ రేవంత్రెడ్డి వైపు మళ్లింది. పీసీసీ చీఫ్ టార్గెట్గా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పదునైన విమర్శలు చేశారు.
“ఢిల్లీలో చేతులు కలుపుతారు.. తెలంగాణలో పోరాటం చేస్తారు.. వారి విధానమేంటో రేవంత్రెడ్డి చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు? కాంగ్రెస్కి బీఆర్ఎస్ బీ టీమ్. ఆ రెండు పార్టీలు త్వరలోనే కలుస్తాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే పార్టీ వీడుతానని రేవంత్రెడ్డి అన్నారు. రేవంత్ కాంగ్రెస్ని వీడే సమయం దగ్గరలోనే ఉంది” అంటూ కామెంట్ చేశారు తరుణ్చుగ్.
కేంద్రంలో బలహీన సర్కారు రావాలని అనుకుంటున్నారని.. విపక్షాల కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని తరుణ్చుగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ రిటైర్ అవుతారని జోస్యం చెప్పారు.