BRS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ నియామకం. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు. ఈ న్యూస్ తెలిసి కొంతమంది అవాక్కైతే.. ఇంకొంత మంది పెదవి విరిచారు. ఏపీలోనూ ఓ స్థాయి నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అంతా అవుట్ డేటెడ్ నేతలే అంటూ చాలామంది ఎద్దేవా చేశారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా గులాబీ బాస్ తన పని తాను చేసుకు పోతున్నారు. అదే జోరులో.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కు గులాబీ కండువా కప్పేశారు. ఆయనతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఒడిశా కీలక నేతలు, యాక్టివిస్ట్ లు బీఆర్ఎస్ లో చేరారు.
గిరిధర్ గమాంగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంటుంది కొందరు సీనియర్లకి. ఎందుకంటే కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వం పతనానికి ఈ గిరిధరుడే కారణం. ఆయన మామూలు నేత కాదు. ఒడిశా మాజీ సీఎం. మాజీ ఎంపీ కూడా. ఈ స్థాయి నేత బీఆర్ఎస్ లో చేరుతుండటంతో.. కొందరు అవాక్కవుతున్నారు. అదే సమయంలో మరికొందరు మళ్లీ లైట్ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం గిరిధర్ గమాంగ్ వయసు 80 ఏళ్లు. ఈ ఏజ్ లో ఏం సాధిస్తారనేది ప్రశ్న. ఎవరూ లేక అవుట్ డేటెడ్ లీడర్లకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారంటూ కేసీఆర్ పై విమర్శ. ఎవరైతే ఏం? ఎవరో ఒకరు ఉన్నారుగా.. అనేది బీఆర్ఎస్ ఆన్సర్.
గతంలో గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 1999లో సుమారు ఆరు నెలల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంపీగా ఉంటూనే సీఎంగా చేశారు. అప్పుడు వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన అనైతికంగా ఓటేశారు. చివరకు ఒక్క ఓటు తేడాతో ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పటి నుంచి గిరిధర్ గమాంగ్ మళ్లీ గెలిచింది లేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. అంతగా ప్రాధాన్యం లేదు.
ఇలాంటి గిరిధర్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు. ఏపీలోనూ తోట చంద్రశేఖర్ లాంటి ఓటమి వీరుడిని అధ్యక్షుడిగా చేశారని.. ఒడిశాలోనూ అలాంటి నాయకుడికే కుర్చీ వేస్తున్నారని.. ఇలాంటి ప్రజాదరణ లేని నేతలతో బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుందనే విశ్లేషణలకు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాత్రం ఎవరో ఒకరు.. వచ్చిన వాళ్లే లీడర్లు..అన్నట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.