Hyderabad: హైదరాబాద్లో బయటపడుతున్న ఉగ్ర మూలాలు టెన్షన్ పెడుతున్నాయి. చాప కింద నీరులా హిజ్బుత్ తహ్రీర్ ఉగ్ర సంస్థ దేశవ్యాప్తంగా నెట్వర్క్ను విస్తరిస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న సల్మాన్ అనే ఉగ్రవాదిని నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సల్మాన్ కదలికలపై పక్కా నిఘా పెట్టిన అధికారులు.. అతనితో పాటు రెండు చోట్ల తనిఖీ చేసి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, ఎస్డీ కార్డులతో పాటు తీవ్రవాదానికి సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అంతర్జాతీయ ఇస్లామిక్ రాడికల్స్ సంస్థ అయిన హిజ్బుత్ తహ్రీర్.. భోపాల్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించేందుకు కుట్రపన్నడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ వేసినట్టు గుర్తించారు. పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు కూడా ప్లాన్ చేసింది. భోపాల్తో పాటు.. హైదరాబాద్లో ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. NIA ఏకంగా నాలుగుసార్లు సోదాలు నిర్వహించింది. మే 24న భోపాల్తో పాటు హైదరాబాద్లో అధికారులు NIA, మధ్యప్రదేశ్ ATS సోదాలు నిర్వహించి…16 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్లో సలీంతో పాటు మరో నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అదే రోజు సల్మాన్ ఇంటికి వెళ్లినప్పటికీ.. ఏటీఎస్ దాడులను గ్రహించిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సల్మాన్ HUTకి చెందిన యాక్టివ్ పర్సన్ అని ఎన్ఐఎ అధికారులు చెబుతున్నారు. ఇతను ఇప్పటికే అరెస్టు అయిన సలీం ఆదేశానుసారం పనిచేసేవాడని వెల్లడించారు. వీళ్లు HUTని హైదరాబాద్ లో విస్తరించేందుకు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇక సలీమ్ నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితుల ఫోన్లలో పాకిస్థాన్కు చెందిన వారి ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా జిమ్ ట్రైనర్, ఆటో డ్రైవర్, ప్రొఫెసర్గా అవతారమెత్తి తాము చేయాల్సింది చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అరెస్టైన 17 మందిలో ఐదుగురు మతం మార్చుకున్న వారే ఉన్నారు. ఇద్దరు నిందితులు మరో ఇద్దరు మహిళలకు కూడా మతం మార్చినట్టు గుర్తించారు. వీరు చేయాలనుకున్న ఉగ్ర దాడులకు విదేశాల నుంచి నిధులు అందినట్టు గుర్తించారు అధికారులు. భారత్లో షరియత్ చట్టం, ఖలీఫా రాజ్యస్థాపనే HUT లక్ష్యమని NIA అధికారులు గుర్తించారు.
నిజాలు ఇలా ఉంటే.. సీఎం కేసీఆర్ మాటలు మరోలా ఉంటున్నాయ్. తమ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు మెరుగయ్యాయని.. హైదరాబాద్లో టెర్రరిస్టులు లేరని ప్రతీసారి గొప్పగా చెబుతుంటారు. మరి ఇదేంది? మాటిమాటికీ ఈ ఉగ్ర కలకలం ఏంటి? అందులోనూ, టెర్రరిస్టుల ఆనవాళ్లను NIAనే పసిగడుతోంది. వారిని అరెస్టులు చేస్తోంది. మరి, మన పోలీసులు ఏం చేస్తున్నట్టు? పాతబస్తీని పూర్తిగా వదిలేశారా? లేదంటే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు.. మజ్లిస్కు భయపడి కాంప్రమైజ్ అవుతున్నారా?