Hyderabad: సీఎం కేసీఆర్ తన ప్రసంగాల్లో పదే పదే ఓ విషయం చెబుతుంటారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు సూపర్ అంటుంటారు. అందుకే, నగరానికి పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు పోతారు. విదేశాల స్థాయిలో సెక్యూరిటీ కల్పిస్తున్నామని అంటారు. దర్పంగా కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూపిస్తూ.. మనమే ది బెస్ట్ అని ఊదరగొడుతుంటారు.
ఇంతాచేస్తే.. ఏం లాభం? హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. 18 నెలలుగా టెర్రరిస్టులు నగరంలోనే మకాం వేసినా.. మన ఖాకీలు గుర్తించలేకపోయారు. ఎక్కడో ఢిల్లీలో ఉండే కేంద్ర ఇంటెలిజెన్స్ చెబితే కానీ.. ఉగ్రజాడ దొరకలేదు. మరి, చీమచిటుక్కుమన్నా పట్టేస్తామని గొప్పలు చెప్పిన.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తున్నట్టు? లక్షల సంఖ్యలో సీసీకెమెరాలు ఏర్పాటు చేశాం.. వాటిని సెంటర్కు అనుసంధానం చేశాం.. అని తెగ బిల్డప్ ఇచ్చారే.. మరి, ఆ కెమెరాలు, ఆ నిఘా సిస్టమ్ అంతా ఏమైనట్టు? ఉగ్రవాదులు ప్రజలతో కలిసిపోతే.. మన మధ్యనే ఉంటూ.. మన మధ్యనే తిరుగుతూ.. మరింత మంది ఉగ్రవాదులను తయారు చేస్తుంటే.. నిఘా వ్యవస్థ నిద్ర పోయిందా? పోలీసులు బాగా పనిచేస్తే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునే కేసీఆర్.. ఇప్పుడు ఈ టెర్రరిస్టులపై నిఘా వైఫల్యానికి బాధ్యత తీసుకుంటారా?
ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది? ప్రశాంతంగా ఉన్న నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? దాదాపు కోటి మందిపైగా జీవిస్తున్న.. ప్రజలు.. ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త ఒకటి బయటకొచ్చింది. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 16మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, తెలంగాణ పోలీస్ బృందాలు కలిసి జాయింట్ ఆపరేషన్ ఆపరేషన్ చేశాయ్.
హైదరాబాద్లో సుమారు 18 నెలలుగా ఉగ్రవాదులు మకాం వేశారు. మరి వీరంతా.. అన్ని నెలలుగా నగరంలో ఏం చేస్తున్నారు? ఏమైనా కార్యక్రమాలకు ప్లాన్ చేశారా? అసలు వీళ్ల టార్గెట్ ఏంటి? ఎక్కడ విధ్వంసానికి ప్లాన్ చేశారు? సిటీలో ఎన్నాళ్లుగా మకాం వేశారు? భోపాల్కు, హైదరాబాద్కు లింక్ ఎక్కడ కుదిరింది? ఇవే ప్రశ్నలు పలు అనుమానాలకు దారిస్తున్నాయ్.
నగరంలో దొరికింది ఐదుగురు. మరి ఇంకా ఎంత మంది ఉన్నారో లెక్క తేలాల్సిఉంది. ఆ నలుగురిలో ఇద్దరు ఉన్నత చదవులు చదివారు. ఒకతను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇంకొకడు డెంటిస్ట్. మరో ఇద్దరు డైలీ లేబర్. వారంతా క్రూరమైన ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారు. స్లీపర్ సెల్స్ గా మారారు. పైనుంచి ఆదేశాల కోసం చూస్తున్నారు. హైదరాబాద్ లో దొరికిన.. ఉగ్ర అనుమానితుల వ్యవహారం గురించి తెలిసి పోలీసులే నోరెళ్లబెట్టారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా ఉగ్రలింకులు బయటపడ్డాయ్. 2022 అక్టోబర్ 2న హైదరాబాద్లో ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి గ్రనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్లో బీహార్లోని దర్బంగా రైల్వేస్టేషన్లో పేలుడు వెనుక కూడా హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర బయటపడింది. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో… ఉగ్రకోణం మూలాలను మరింతగా అన్వేషించేందుకు హైదరాబాద్లో NIA భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో మాసాబ్ ట్యాంకు దగ్గరిలోని మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్ఖాన్, ఇమ్రాన్ మాలిక్ల పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరు మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి నివాసం ఉన్నట్లు తేలింది. ఇద్దరూ బట్టల దుకాణం నిర్వహించారు. పాస్ పోర్ట్పై ఓసారి పాకిస్తాన్కు వెళ్లొచ్చారు కూడా. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సభ్యుడైన ఇక్బాల్తో వీరు తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాళ్లని అప్పట్లో ఎన్ఐఏ గుర్తించింది. 20 ఏళ్లుగా బట్టల దుకాణం నడుపుతూ ఏమీ ఎరుగనట్టుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడం… స్థానికులు, పోలీసులు కూడా కనిపెట్టకుండా ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు.
వరుస ఘటనలతో హైదరాబాద్ ఎంత సేఫ్ అనే చర్చ మొదలైంది. స్లీపర్ సెల్స్కు అడ్డాగా మారడంతో.. ముందుముందు ఉగ్రదాడులు జరుగుతాయనే భయం వెంటాడుతోంది. పదవిలో ఉన్నవారికి కాపలా, ప్రతిపక్ష నేతల అరెస్టులు, వాహనదారులకు చలానాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలపై చూపించే శ్రద్ధ.. ఉగ్రవాదుల ఆనవాళ్లనూ కనుక్కోవడంపై పెడితే.. ఎవరో వచ్చి చెప్పేవరకూ మనకు తెలీకుండా ఉండే దుస్థితి వచ్చుండేది కాదంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని.. టెక్నాలజీతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్కూ ప్రాధాన్యం ఇచ్చి.. ఉగ్ర చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది తాజా అరెస్టులు.