MLC by Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్ మాల్ జరిగిందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారంటూ ఆయన ఆరోపించారు. తాము అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదంటూ రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కూడా కనీసం స్పందించలేదన్నారు.
ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలంటూ రాకేశ్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందంటూ ఆయన ఆరోపించారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చినంకనే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరపాలంటూ రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖండించారు. అధికారుల పనితీరుపై బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలో మాదిరి గోల్ మాల్ చేసి గెలవాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఓటమి భయంతోనే ప్రస్తుతం అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితిని చూస్తే ఓటమిని ముందుగానే అంగీకరించినట్లు అర్థమైతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: కలిసి పనిచేద్దాం.. చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
ఇదిలా ఉంటే నల్లగొండలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండోరోజు కొనసాగుతోంది. తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు మొత్తం 1,06,234 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. ఇటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 27,493 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.