IPS Transfers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రతి డిపార్ట్ మెంట్ లో ప్రక్షాళన కొనసాగుతోంది. తాజాగా పోలీస్ శాఖలోనూ మార్పులు చేర్పులు షురూ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లకు కొత్త బాస్ లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు.
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్గా సందీప్ శాండిల్యకు బాధ్యతలు అప్పగించారు. దేవేంద్ర సింగ్ ను చౌహాన్ , స్టిఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్నారు. రాచకొండ కొత్త సీపీ సుధీర్ బాబు.. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. సైబరాబాద్ కొత్త సీపీ అవినాష్ మహంతి ప్రస్తుతం సైబరాబాద్ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు సీవీ ఆనంద్, సైబరాబాద్ కు స్టిఫెన్ రవీంద్ర, రాచకొండకు మహేష్ భగవత్ సీపీలుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి సీపీ ఆనంద్ ను తప్పించి సందీప్ శాండిల్యను ఈసీ నియమించింది. అలాగే ఆ సమయంలో రాచకొండ సీపీ బాధ్యతలు దేవేంద్ర సింగ్ చౌహాన్ అప్పగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త సీపీలను నియమించింది.