Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అజ్మీర మంగు, బానోతు రమేష్ లు బుధవారం మధ్యాహ్నం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం మరో నలుగురిని ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో లక్ష్మణ్ ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి అతని ప్రాణాలు నిలిపి హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు కాగా….ముగ్గురు చనిపోయారు. నలుగురికి కాళ్లను తొలగించారు.
అయితే వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం వల్ల కాళ్లు నుంచి గుండెకు పంపింగ్ చేసే నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు.
రాత్రి పొద్దు పోయేంత వరకు మృతదేహాలను గ్రామంలోకి అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుపడ్డారు.
మృతుల కుటుంబసభ్యులకు వెంటనే ప్రభుత్వ సాయం అందించి బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు…. పక్కా ఇల్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మరోవైపు ఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది. ఇది సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదంటే….. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.