Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఎర్రమంజిల్ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ENC మురళీధర్రావు ఆఫీసులో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇక కరీంనగర్ జిల్లా LMDలోని ఇరిగేషన్ ఆఫీస్లోనూ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి, మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పది ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తున్నాయి.
పేపర్ పై కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు 1698 గ్రామాలకు లబ్ది అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయి కూచుంది. ఇంత చేసి కాళేశ్వరంతో ఏమైనా ఒరిగిందంటే ఏదీ లేదు. నీళ్లు పైకి ఎత్తాలి.. పై నుంచి వరద వస్తే కిందికి గేట్లు వదలాలి.. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్సారెస్పీ నుంచి సహజసిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కు ఆపేయాలనుకోవడమే పెద్ద లోపం.
ఎంతో అనుకుని, ఎంతో చెప్పి తెరపైకి తెచ్చి.. కొత్త డిజైన్లను జనంపై రుద్ది.. ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల డబ్బుతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగిపోయి నీటినంతటినీ ఖాళీ చేసేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంప్ హౌస్లు, సొరంగ మార్గాలు వీటన్నింటిని 36 నెలల టైంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ క్లైయిమ్ చేసుకుంది.
హడావుడి పనులు, రికార్డులు సృష్టించాలన్న పరిస్థితి తప్ప పనిమీద శ్రద్ధ చూపెట్టలేకపోయారంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద 97,449 కోట్ల రుణాన్ని సమకూర్చుకోగా ఇందులో జూన్ 2022 నాటికి కేవలం 79 కోట్లను మాత్రమే అసలు రూపంలో రీపేమెంట్ చేశారు. 4,427 కోట్ల మేర వడ్డీగా చెల్లించారంతే.
ఈ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. కొత్తగా 18 లక్షల ఎకరాల మేర పొడి భూమి సాగులోకి వస్తుందని గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి వస్తున్నందున ఒక్కో సీజన్కు ఒక్కో ఎకరాకు సుమారు 50 వేల మేర ఖరెంట్ కోసమే ఖర్చు అవుతుందన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. గడిచిన తొమ్మిదేళ్లలో 1.55 లక్షల కోట్లను సాగునీటిరంగంపై గత ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికీ అదనంగా నీటిపారుదల విస్తీర్ణం పెరిగింది ఏమంత గొప్పగా లేదు.