మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో స్టూడెంట్ సూసైడ్ కలకలం రేపుతోంది. శ్రీచైతన్య కాలేజ్లో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని వర్ష మృతదేహాన్ని మార్చురికి తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వర్షది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాలేజ్ యాజమాన్యం విద్యార్థిని ఉరి వేసుకుందని చెబుతోంటే.. అదంతా కట్టుకథేనని మండిపడుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వర్ష మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవు పేరుతో శ్రీచైతన్య డీన్ ఒత్తిడి చేశారని.. ఆ ప్రెజర్ తట్టుకోలేకనే సూసైడ్ చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలేజ్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్ష మృతికి డీన్ మమత బాధ్యత వహించాలని.. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు కమిటీ వేసి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోపక్క వర్ష తమ వల్ల చనిపోలేదని.. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతోనే.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని కాలేజ్ యాజమాన్యం చెబుతోంది.