Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తి.. స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా.. అందులో పాల్గొన్న ప్రదీప్తి సందడి చేసింది.
స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతూ ఆడిపాడింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. కళాశాలలోని లెక్చరర్లు ఆమెకు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
కన్నబిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లముందే ప్రదీప్తి కుప్పకూలి, చావు బతుకులతో పోరాడడంతో స్నేహితులంతా తల్లడిల్లిపోయారు. సుదీప్తికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉంది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు.. తల్లిందండ్రులకు ముందే సూచించారు. అయితే ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో.. ఇప్పుడిలా ప్రాణాలు విడిచింది ప్రదీప్తి.