Inter Second Year Exams from Today : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అవ్వగా.. నేటి నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను మొత్తం 9 లక్షల 80వేల 978 మంది విద్యార్థులు రాస్తుండగా.. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4లక్షల 78వేల 718 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ద్వితీయ సంవత్సరం నుంచి 5లక్షల 2వేల 260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సెల్ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.
Read More : నేడే మెగా డీఎస్సీ.. 11,062 పోస్టులకు నోటిఫికేషన్
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్ కాలేజీల్లో, 407 సెంటర్లను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల కోసం 27వేల 900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అన్ని జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో.. అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 4 లక్షల 88 వేల 113 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 19 వేల 641 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించలేదు.
కుత్బుల్లాపూర్ లో కేమ్ బ్రిడ్జి పరీక్ష సెంటర్లో నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. అలాగే వికారాబాద్ సిద్ధార్థ కాలేజీలోనూ ముగ్గురిని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదుగురు విద్యార్థులను, సిద్ధిపేటలో ఇద్దరు విద్యార్థులను ఆలస్యంగా వచ్చిన కారణంగా పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో.. విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఎవరైనా కాపీ కొట్టినా.. ఒక వ్యక్తి పరీక్షను మరొకరు రాసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.