నెలలు నిండిన గర్భిణి స్త్రీ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. బిడ్డ కడుపులోనే మరణించింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లికి చెందిన తిప్పరవేని చందు, అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొలి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు అమూల్యను మూడు రోజుల క్రితం వేములవాడ ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని అమూల్య కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా డాక్టర్లు మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఆపరేషన్ చేయాలంటే అనస్తీషియా ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుతం తమ ఆస్పత్రిలో అనస్తీషియా అందుబాటులో లేదని వైద్యులు సాకులు చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని పొంతనలేని సమాధానాలు చెప్పారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటికే అమూల్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని డాక్టర్లు గమనించారు. వెంటనే తేరుకున్న డాక్టర్లు ఆదరాబాదరగా ఆమెకు ఆపరేషన్ చేశారు. కానీ.. అమూల్య గర్భంలోని శిశువు మరణించాడు. మృతి చెందిన శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఏరియా ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసికందు తల్లిగర్భంలోనే మృతి చెందిందని ఆరోపించారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అమూల్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.