Indira Shoban Serious on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ మరోసారి ఫైరయ్యారు. ఇందుకు సంబంధించిన ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ‘అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రభుత్వ దవాఖాన్లను నాశనం పట్టించిన కేటీఆర్, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. పదే పదే గాంధీ హాస్పిటల్పై, ప్రభుత్వ దవాఖాన్లపై బురద జల్లుతూ ట్వీట్లు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ట్వీట్లకే ఆయన పరిమితమయ్యారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చో పెట్టినా కేటీఆర్కు సిగ్గు రాలేదు. గురివింద గింజ తన కింద నలుపు తాను చూసుకోలేదు అన్నట్టుగా కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పాలనలో జరిగిన దారుణాలను మర్చిపోయినట్టున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దారుణాలన్నీ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని కేటీఆర్ ఓసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది.
Also Read: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు
కరీంనగర్, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన్ల నుంచి ప్రజలు తమ బిడ్డల శవాలను మోసుకుపోయిన ఘటనలను ఆయనకు గుర్తు చేస్తున్నాం. 2017లో జరిగిన మాతా, శిశు మరణాలను, 2022లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫేయిలై బాలింతలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కేటీఆర్కు గుర్తుకులేదా?. కోవిడ్లో వందల మంది మరణిస్తే, పదుల సంఖ్యలోనే మరణాలను చూపి.. చావులను కూడా తప్పుగా చెప్పిన విషయం కేటీఆర్ కు గుర్తులేదా?. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్కీమ్ను నాశనం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని గాడిన పెట్టింది. ఉచిత వైద్య పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ప్యాకేజీల రేట్లను 20 నుంచి 25 శాతం మేర పెంచారు. కొత్తగా 163 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, పేదలకు మేలు చేసే విధంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా చర్యలు తీసుకున్నారు. పదేండ్లుగా ప్రభుత్వంలో ఉండి కట్టలేకపోయిన ఉస్మానియా దవాఖాన సమస్యకు పది నెలల్లోనే ముగింపు పలికారు. గోషామహల్లో అద్భుతమైన ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పది నెలలు కూడా తిరగకుండానే 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. మరో 5 వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వల్ల మీరు పెంచి పోషించిన కార్పొరేట్ హాస్పిటళ్లకు గిరాకీ తగ్గుతుందని మీరు భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వ దవాఖాన్లపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా మీరు బుద్ధి మార్చుకోకపోతే, ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తరిమికొట్టే రోజులొస్తాయి. మీరు వేసిన నిజనిర్దారణ కమిటీని మేము స్వాగతిస్తున్నాం. మీకు, మీ కమిటీ సభ్యులకు దమ్ముంటే ఆరోగ్య రంగంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చలకు రావాలి. ఎక్కడైనా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా?’ అంటూ ఇందిరా శోభన్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!