BRS : దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంబిగించిన కేసీఆర్ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు.. కార్యాలయ ప్రాంగణంలో రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాజశ్యామల యాగం పూర్ణాహుతి నిర్వహించారు. కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.