IIT Guwahati student death(Telangana news today) :
తెలంగాణకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి(IIT Guwahati)లో ఇంజినీరింగ్ ఈసీఈ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు ఐఐటీ క్యాంపస్కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31న వారంతా హోటల్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. జనవరి 1న ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు వాష్రూమ్కు వెళ్లగా ఐశ్వర్య అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ రూమ్ లను పరిశీలించారు. హోటల్ సిబ్బందిని, ఐశ్వర్య స్నేహితులను పోలీసులు విచారించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి హోటల్ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు ఇతర స్నేహితులు మత్తులో ఉన్నట్లు హోటల్ సిబ్బంది చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఐఐటీ గువాహటి యాజమాన్యం ఐశ్వర్య మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపింది. ఐశ్వర్య మృతి బాధాకరమని, పోలీసులు విచారణ చేపట్టారని యాజమాన్యం పేర్కొంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఐశ్వర్య మృతి చెందిందా ? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.