Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI.. 2022కు గాను ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించింది. సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా చిరు చేసిన సేవలకుగాను ఈ పురస్కారం వరించింది.
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్రప్రభుత్వం తరఫున మంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించారు. అవార్డుగా.. సిల్వర్ పికాక్ మెడల్, రూ.10లక్షల నగదు, ధ్రువపత్రం అందజేస్తారు.
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి అందుకున్నారు. ఈసారి చిరంజీవిని ఈ అవార్డు వరించింది.
చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు. భారత పద్మ భూషణుడు మన మెగాస్టార్. సినీ రంగంలో అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటికే రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు మూడు నందులు, తొమ్మిది ఫిల్మ్ ఫేర్లు ఆయన మకుటంలో చేరాయి. తాజాగా మరో జాతీయ స్థాయి అవార్డు రావడం మరింత గర్వకారణం. విశేష అభిమానుల ప్రేమ కలిగిన చిరంజీవికి.. ఇది మరో చిరు పురష్కారం.
ఇటీవలే గాడ్ ఫాదర్ మూవీతో టాలీవుడ్ గాడ్ ఫాదర్ గా ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్. వరుస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ ను రఫ్ఫాడిస్తున్నారు. బాసు జోరు, హుషారు మామూలుగా లేదు. వాడ్తేరు వీరయ్యతో మరో మాస్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ ఇక్కడ.