CM Revanth Reddy Chit Chat: కాకతీయులను చంపిన సమ్మక్క సారక్కలవైపే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజముద్ర నుంచి కాకతీయులు కళాతోరణం తొలగిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడితో పోరాడిన వీరవనితలు మేడారంలో కుంకుమ భరిణెలుగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాకిస్థాన్లా ఒక రోజు ముందే సంబురాలు నిర్వహించారన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పై కేసీఆర్ కు గౌరవం లేదని, అమరవీరులు అంటే కేసీఆర్కు ద్వేషమని అన్నారు. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం. 2015లో అమరవీరుల స్థూపం కట్టాలని తానే మొదట డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నయీం కేసుపై చర్చ మొదలు కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి 1508 కొత్త వాటికి పర్మిషన్ ఇచ్చాడి సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం మొదటి లక్ష్యం డ్రగ్స్ ఏరివేత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలకు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు సీఎం తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని.. కేసీఆర్ను కాపాడటం కోసమే కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంపై సీబీఐ విచారణ అడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని.. కేవలం ఇంటరప్షన్ మాత్రమే ఉందన్నారు సీఎం. అవసరమైతే లాగ్ బుక్లను చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ప్రతిపక్షాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు.
Also Read: ‘నేను రాను.. రాలేను..’ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ డుమ్మా..
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 9 నుంచి 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు ఎమ్మెల్సీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని గెలుచుకోనున్నట్లు తెలిపారు. అనుకున్న ఫలితాలు రాకపోతే రెండు గంటలు ఎక్కువ పని చేస్తానన్నారు సీఎం. ఇక టీపీసీసీ పదవి గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం ముగుస్తుందని, ప్రముఖ నాయకుడే కొత్త పీసీసీగా వస్తాడని స్పష్టం చేశారు.